సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం మండలం పోతులనాగేపల్లిలో భూమి పరిహారానికి సంబంధించి వివిధ పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను కింద ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంచేసిందని, 71,811,49 ఎకరాలను ఇళ్లపట్టాల రూపంలో పంపిణీచేసిందని, దాదాపు 30 లక్షల మందికి లబ్ధిదారులకు ఈ కార్యక్రమం వల్ల లబ్దిపొందారన్నారు. ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు రూ. 75 వేల కోట్ల పైనే ఉందని, దీంట్లో భాగంగా ఇళ్లపట్టాల కోసం 25,374.66 ఎకరాల భూమిని రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 10,243 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. భూమి సేకరించిన వారికి ఎప్పటికప్పుడు చెల్లింపులు కూడా చేసిందని, ఇంత పెద్ద కార్యక్రమంలో అక్కడక్కడా కొంతమంది కోర్టులో కేసులు వేశారన్నారు. ఈ వివాదాలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించమని, అవసరమైతే కోర్టు వెలుపల ఒప్పందాల ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరికేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసిన నేపథ్యంలో ఆ ప్రక్రియ నడుస్తోందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం పోతుల నాగేపల్లిలో కూడా 90 మందికి చెందిన 210 ఎకరాలను ఇళ్ల పట్టాలకోసం సేకరించడం జరిగిందన్నారు. రైతుల ఆధీనంలో ఉన్న ఈ అసైన్డ్ ల్యాండ్స్ కోసం అధికారులు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించారని, ఇందులో 38 మంది రైతులు పరిహారాన్ని కూడా తీసుకున్నారన్నారు. మిగిలిన రైతులు ఈ పరిహారాన్ని అంగీకరించక ఇందులో కొంతమంది కోర్టు కేసులు కూడా వేశారని, వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది.. ప్రభుత్వం పరిహారం కింద మంజూరు చేసిన మొత్తం కూడా స్థానిక ఆర్డీఓ వద్దే ఉందన్నారు. ఈ వివాదం పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు. ఈ వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడాన్ని, ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నామని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు.
-----------------------
Admin