సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / వచ్చే ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చిత్తయ్ పోక తప్పదని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి సభ్యులు మహ్మద్ అలీ ఖాన్ బాబర్, ఐఎన్టియుసి నేత పి. రఘు, తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అన్యాయాలను, పాలకుల దౌర్జన్యాలను ప్రశ్నిస్తుంటే అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు భయపడుతున్నారని అన్నారు. 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుని వారి చావులపై తెలంగాణ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో కులుకుతున్న పాలకులకు ప్రజల కష్టాలు పట్టవా అని విమర్శించారు. మేమే నెంబర్ వన్ అని విర్రవీగుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందులో నెంబర్ వన్ అని "వీర్లపల్లి శంకర్" ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను మోసం చేయడంలో నంబర్ వన్ మీరేనా అని ప్రశ్నించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మోసం చేయడంలో నెంబర్ వన్ మీరేనా అని అన్నారు. దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంచుతామని చెప్పి చేతులెత్తేసిన మీరు నెంబర్ వన్ పొజిషనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎన్ని? ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని? అక్రమ సంపాదనలో నెంబర్ వన్ మీరు కాదా అని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత ఊరిలోనే 400 ఎకరాలను పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా 15000 ఎకరాలను పంచిన ఘనత కూడా తమదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దయతోనే ఉద్యోగంలో చేరిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడి ఉద్యోగంలో సస్పెండ్ కాలేదా? అని ప్రశ్నించారు. పేద ప్రజలకు ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇవ్వని మీకు వచ్చే ఎన్నికల్లో మొఖాలు చెల్లుతాయా అని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఏం ప్రగతి సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటారని అన్నారు. శంకుస్థాపనల పేరిట కాలయాపన చేస్తూ ఒక్క అభివృద్ధి కూడా చేపట్టని పాలకులను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. మై హోమ్ లాంటి రియాల్టర్లకు ప్రజా సంపదను దోచిపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి భాగోతాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మంత్రులు అక్రమంగా దోచుకుని, దాచుకున్న సంపాదన పైనే ఎన్నికలు ఉంటాయని అన్నారు. నియోజక వర్గంలో ఐదేళ్ల నాటి శంకుస్థాపనలను చూపిస్తామని పేరుకు అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్బాలు పలికి ఆ తర్వాత అభివృద్ధి జాడ మర్చిపోతారని అన్నారు. నియోజకవర్గానికి సాగునీరు ఇస్తామని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టిస్తామని చెప్పిన పాలకులు పది ఎకరాల కైనా సాగునీరు ఇచ్చారా అని మంత్రిని ప్రశ్నించారు. మంత్రికి బుద్ధి లేదంటూ శంకర్ విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ అసెంబ్లీలో మంత్రి దౌర్జన్యాల గురించి ఎవరిని అడిగినా చెబుతారని తన సొంత పార్టీలోనే తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవిని ఎంత పిండి పీల్చుకు తింటున్నాడో తమకు తెలియదా? అని అన్నారు. దౌర్జన్యాలు, రౌడీయిజం మంత్రికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని పోలీసులను తమ జేబులో పెట్టుకొని ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో మీ అంతు చూసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒక మంత్రి హోదాలో ఉంటూ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించమని మంత్రికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. మంత్రి తన రౌడీయిజాన్ని పాలమూరులో ప్రదర్శించుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో 60 సీట్లకు అభ్యర్థులు లేరని చెబుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే ఎవరి ఇంటి ముందు వచ్చి నిలబడతావో తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పెట్టిన భిక్షతోనే ఈరోజు ఉద్యోగ నాయకుడిగా మంత్రిగా ఎదిగారన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం నుండి మంత్రి, ఎమ్మెల్యే కుటుంబం వరకు కుటుంబ పాలన అయిందని, కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయని శంకర్ ప్రస్తావించారు. తొమ్మిదేళ్లపాటు పాలన పేరిట దోచుకుని దాచుకున్న అక్రమాలపైనే ఎన్నికల తీర్పు ఉంటుందని హెచ్చరించారు. ప్రతిపక్షాలను బెదిరించడం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చెస్తే కర్రు కాల్చి వాత పెట్టడానికి పాలమూరు, షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దగా మోసం అవినీతిలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉందని మరోసారి కాంగ్రెస్ పై అవాకులు చావాకులు పేలితే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తుపాకుల శేఖర్, రమేష్, వెంకట్ రెడ్డి, రవీందర్ గౌడ్, దేవేందర్, రాజశేఖర్, దేవగిరి, నవీన్, నర్సింలు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin