సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: సింగరేణి సంస్థలో మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు సర్వీస్ లో ఉండి ఒక సంవత్సరం మస్టర్ ను ప్రాతిపదికన తీసుకొని డిస్మిస్ అయిన కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.బుధవారం పార్టీ కార్యాలయంలో సింగరేణి డిస్మిస్ అయిన కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు ఉద్యమ నేతగా కెసిఆర్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆంధ్రా పాలకులు నిర్దాక్షిణ్యంగా తొలగించిన ప్రతి సింగరేణి కార్మికుని గుండెలో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి మరోమారు సింగరేణి కార్మికులుగా ఉద్యోగ భృతిని కల్పిస్తానని చేసిన వాగ్దానాన్ని ఇకనైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.2000 సంవత్సరం నుంచి డిస్మిస్ కార్మికులు ఇప్పటివరకు వివిధ రూపాలలో తమ బాధను,ఆవేదనను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ కంటితుడుపు చర్యగా వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప డిస్మిస్ కార్మికులకు భరోసా కల్పించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సింగరేణి వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలగించిన కార్మికులు 100 లోపు ఉన్నారని,వారికి కూడా ఒక అవకాశం కల్పిస్తే ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు.మూడు,నాలుగు సంవత్సరాల సర్వీసు తోపాటు ఒక సంవత్సరంలో 100 మస్టర్లను ప్రాతిపదికన తీసుకొని వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలన్నారు.ఈవిషయంలో సింగరేణి యాజమాన్యం,గుర్తింపు సంఘం,ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈకార్యక్రమంలో డిస్మిస్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెనిగారపు నిరంజన్ కుమార్,డిస్మిస్ సంఘం నాయకులు గంధం మల్లికార్జున్ రావు,కన్నబోయినా మురళి,బీఎస్పీ పట్టణ అధ్యక్షుడువంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin