సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఢిల్లీ : భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీ ఎన్ఎస్ఎస్ ) -2023 యాక్ట్ లో నిందితులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే.. వెంటనే అరెస్టులు చేపట్టేలా.. సెక్షన్ 35(3)ని సవరించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతానికి..సెక్షన్ 498A వంటి తీవ్రమైన నాన్-బెయిలబుల్ కేసులతో సహా 7 సంవత్సరాల వరకు శిక్షార్హమైన అన్ని కాగ్నిజబుల్ నేరాలలో పోలీసులు ముందస్తు అరెస్టు నోటీసు జారీ చేయాలని బీఎన్ఎస్ఎస్ యాక్ట్ నిర్దేశిస్తుందని తెలిపారు. బాధిత మహిళలు, పిల్లలకు అన్యాయం జరగనీయొద్దు.. ఈ నిబంధన దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఉద్దేశించినప్పటికీ, నిజమైన బాధితులకు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ రఘురాం రెడ్డి పేర్కొన్నారు. నోటీసులతో సమయం ఇవ్వడం వల్ల నిందితులు..బాధితులను బెదిరించడానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి మరియు అరెస్టు నుండి తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సెక్షన్ 173(3) కింద 14 రోజుల ప్రాథమిక విచారణ తర్వాత కూడా, తక్షణ చర్య తీసుకోబడదని..గృహ హింస, వరకట్న వేధింపులు మరియు సైబర్ నేరాల బాధితులపై సకాలంలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో బిహార్ కు చెందిన అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు సత్వర అరెస్టులపై హెచ్చరించిందని కానీ.. అన్ని సంఘటనల్లో నేరస్తులకు సమయం ఇవ్వడం సరికాదని చెప్పారు. సెక్షన్ 35(3) ను ఈ కింది విధంగా సవరించాలని.. ఎంపీ రఘురాం రెడ్డి కోరారు.. 1. మహిళలు, పిల్లలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన కేసులను మినహాయించండి. 2. నిందితులను వెంటనే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులను అనుమతించండి. 3. అటువంటి సందర్భాలలో ఫిర్యాదు వచ్చిన వెంటనే నోటీసును అందించడానికి, అరెస్టులకు అనుమతి ఇవ్వండి. న్యాయం ఆలస్యమయితే న్యాయం నిరాకరించబడడమే. బాధితులను రక్షించడానికి మరియు చట్ట నియమాలను నిలబెట్టడానికి ఈ సవరణ చాలా ముఖ్యమైనది.
-----------------------
Admin