సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు పరిధిలోని సబ్ సెంటర్ "సి " ఏరియాలో నిర్వహిస్తున్న లెప్రసీ సర్వేను డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి క్షేత్రస్థాయిని పరిశీలించారు. అక్కడ ఉన్న ఎమ్.ఎల్.ఎచ్.పి. డాక్టర్ షేక్ ముస్తాఫిన్ హమ్మద్ తో మాట్లాడి అక్కడ జరుగుతున్న లెప్రసీ సర్వేను గురించి అడిగి డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలుసుకున్నారు. ఇందిరానగర్ కాలనీలో ఆశాలు చేస్తున్న లెప్రసీ ఇంటింటి సర్వేను, హౌస్ టు హౌస్ తిరిగి డాక్టర్ ఎస్ జయలక్ష్మి పరిశీలించారు. కుష్టు వ్యాధి ఒక సూక్ష్మ క్రిమి (మైకో బ్యాక్టీరియం లేప్రే) ద్వారా సోకే వ్యాధి అని, ఇది వంశపారంపరంగా రాదు అని జయలక్ష్మి చెప్పారు. శరీరంపై ఎక్కడైనా స్పర్శ కోల్పోవడం, ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణమని చెప్పారు. వ్యాధి లక్షణాలు స్పర్శ లేని/ మొద్దు బారిన చర్మం, మచ్చలు కుష్టు వ్యాధి కావచ్చు అని, కనుబొమ్మలు రాలిపోవడం, చెవితమ్మెలు మందంగా మారడం, చేతులు, కాళ్ళలో తిమ్మిరిలు, వాపులు, పుండ్లు, బొబ్బలు, ఒంటిపైన గడ్డలు, కాయలు రావడం ముక్కు నుంచి రక్తం పడడం, వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గరలో గల ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాలని తెలియజేశారు. వ్యాధి నిర్ధారణ చికిత్స అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా జరుపబడును. ఈ వ్యాధికి నిర్ధారించిన తర్వాత 6 నుండి 12 నెలలు చికిత్సతో వ్యాధి పూర్తిగా నయం అవుతుందని తెలియజేశారు. వ్యాధి వలన ఏర్పడిన అంగవైకల్యం శాస్త్ర చికిత్సతో సరి చేయవచ్చని చెప్పారు. వ్యాధి బారిన పడిన వారందరూ తమ తమ పూర్తి సామాజిక జీవితం గడపవచ్చని చెప్పారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి యం.డి.టి. చికిత్స ఇచ్చినచో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారి తీయదు అని చెప్పారు. కుష్టు వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి, లక్షణాలు ఏర్పడడానికి సగటు మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ షేక్ ముస్తాకిన్ అహ్మద్ , హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఆశాలు పాల్గొన్నారు.
-----------------------
Admin