సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (కలెక్టరేట్) : రెండో ఏఎన్ఎంల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, సమస్త ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అసెంబ్లీలో, వేదికలపై ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మోసం చేసేందుకేనా అని కొత్తగూడెం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు మునిగడప పద్మ ప్రశ్నించారు. క్రమబద్దీకరణ డిమాండ్పై రెండో ఏఎన్ఎంలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన తొమ్మిదో రోజు నిరసన శిభిరాన్ని గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, మిడ్డేమీల్స్, రెండో ఏఎన్ఎం వంటి తదితర ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ అనుబంద సంస్థల్లో పనిచేస్తు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ పావులగా వాడుకుంటోందని, కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారం, పథకాల అమలుకోసం వాడుకుంటుందే తప్ప వారికి చట్టబద్దంగా అమలు కావాల్సిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలు చేయకుండా మహిళా ఉద్యోగులను రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. 16 సంవత్సరాలుగా రెండో ఏఎన్ఎం హోదాతో ప్రజలకు వైద్యసేవలందిస్తూ ఎంతో అనుభవం ఉన్న మహిళా సిబ్బందిని వైద్యశాఖ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా ఉద్యోగ ప్రకటన విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్లను క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటనను అమలు చేయాలని, హక్కులు అమలు చేయాలని రెండో ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. చర్చల పేరుతో కాలాయాజన చేయకుండా ఏకైక డిమాండైన క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రెండో ఏఎన్ఎం యూనియన్ జిల్లా నాయకులూ ఎండి. సజ్జుబేగం, బానోతు ప్రియాంక, కౌసల్య, అరుణ, రాములమ్మ, పార్వతి, పుష్ప, బాల నాగమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin