సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పల్లెల్లో ఎక్కడ చూసినా బెల్టు షాపుల కిక్కు ఫుల్లుగా కనిపిస్తోంది. ఏ గ్రామంలో చూసినా ఏ తండాలో చూసినా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.నిర్వాహకులు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిస అవుతూ జీవితాలను నాశనం చేసు కుంటున్నారు.యువత మద్యానికి బానిసై నేరస్తులుగా మారి పలు కేసుల్లో చిక్కు కుంటున్నారు.తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు ముడుపులు తీసుకుని మౌనంగా ఉంటున్నారని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 2,500 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలో 20 మద్యం బెల్ట్ షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా సాగుతున్నాయి.అంటే ఈ తీరున ప్రతి 125 మందికి ఒక బెల్ట్ షాప్ ఉన్నట్లు లెక్క గ్రామంలో నెలకొన్న 20 మద్యం బెల్ట్ షాపులలో ఎక్కువగా మద్యం విక్రయించేది మహిళలే కావడం కొసమెరుపు. అంతేకాకుండా ఒక్కో బెల్టు షాపు నుంచి నుంచి ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అవినీతి అధికారులకు భారీగా ముడుపులు ఇస్తున్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల నిర్వాహకులే స్వయంగా ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారనే సమాచారం తెలిపినా తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతూ అధికారులు చేతులు దులుపు కుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు బెల్ట్ షాపుల నిర్వాహకులు క్వార్టర్ పై రూ.30 నుంచి రూ.50 బీర్ల పై రూ. 40 నుంచి రూ. 60 వరకు అధికంగా వసూలు చేస్తూ దండుకుంటున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పల్లెల్లో గాని తండాల్లో గానీ బెల్ట్ షాపుల వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికైనా అబ్కారీ శాఖ అధికారులు బెల్టు దుకాణాల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించి పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాపుల పై కఠిన చర్యలు తీసుకోవాలని యువత, ప్రజలు మద్యానికి బానిస కాకుండా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు....
-----------------------
Admin