సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చేవారు.. తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు కానీ, మనిషిలోని మూఢత్వాన్ని తొలగించి, మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే అని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు... షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో సోమవారం ఘనంగా గురు పౌర్ణమి వేడుకలను జరిపారు. ఆలయ కమిటీ నిర్వాహకులు డాక్టర్ విజయ్ కుమార్, కమ్మదనం సుధాకర్, డాక్టర్ మల్లప్ప తదితర నిర్వాహకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నిరుపేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. దేవాలయంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువ జామునుంచే సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే అంజయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమతో శిష్యుడికి గురువు విద్యను బోధిస్తాడు. తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తానంటాడు శిష్యుడు. ఇదీ గురుశిష్యుల సంబంధం. ఏ రకమైన పేగుబంధం లేని పరమాత్మ సంబంధం అది అనీ ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజనేయులు సన్మానించి గురు పౌర్ణమి సందర్భంగా ఆశీర్వదించారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్, ఎస్పీ శివ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin