సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించడానికి మంగళవారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా, ఎన్నికల సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, సుకుమా జిల్లా కలెక్టర్ హరీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి , ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అలం, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ పి.కరుణాకర్,భద్రాచలం ఐటిడిఎ పీఓ ప్రతీక్ జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin