సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తల్లిదండ్రుల ఆశయాలు, కష్టాలు గుర్తు తెచ్చుకుని సాధన చేస్తే ఉద్యోగాలు తప్పకుండా సాధించవచ్చని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS అభిప్రాయపడ్డారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పోలీసు పిల్లలు ఎస్సై/ కానిస్టేబుళ్ల ఉద్యోగాలలో రాణించేందుకు స్థానిక డిటిసిలో జిల్లా పోలీసుశాఖ సిద్ధం చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మంచి ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తున్నాం బాగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగాలు, విజయాలు వాటంతట అవే రావని... నిరంతర శ్రమ, కఠోర సాధనతోనే వస్తాయన్నారు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పక్కాగా పారదర్శకంగా జరుగుతుందని... దళారులు, మోసగాళ్ల మాటల వలలో పడి ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళితే నష్టపోతారని సూచించారు. సమయపాలన, వ్యక్తిగత క్రమశిక్షణతో తర్ఫీదు తీసుకోవాలన్నారు. ఫిజికల్ ఈవెంట్స్ శిక్షణకు కూడా క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. పోలీసు ఉద్యోగాల నియామకపు పరీక్షల వ్యవధి తక్కువుగా ఉందని... దీన్ని దృష్టిలో ఉంచుకుని బాగా ప్రిపేర్ కావాలన్నారు. ఎస్సై ఉద్యోగాల పరీక్షల వరకు ప్రతీ రోజూ కోచింగ్ నిర్వహిస్తామని... జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న పోలీస్ క్యాంటీన్ , డిజిటల్ లైబ్రరీల సేవలు వినియోగించుకోవచ్చన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టడీ సెంటర్ కమ్ డిజిటల్ లైబ్రరీలో ఇదివరకే సివిల్స్ , గ్రూప్స్ , బ్యాంకు, పదవ తరగతి ఫెయిల్ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం... తాజాగా పోలీసు పిల్లలకు ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించడంతో పోలీసువర్గాల్లో హర్షం వ్యక్తమయ్యింది. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఇ.నాగేంద్రుడు, హనుమంతు, స్పెషల్ బ్రాంచి సి.ఐ చక్రవర్తి, ఆర్ ఎస్ ఐ లు ప్రవీణ్ కుమార్ ,రాజశేఖర్ రెడ్డి, ప్రదీప్ సింగ్ , భాస్కర్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్, శ్రీనివాసుల నాయుడు, ఆనందబాబు, సరోజ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin