సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గృహాలక్ష్మి పథకానికి వచ్చిన ప్రతి ధరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం గృహాలక్ష్మి పథక ధరఖాస్తులు విచారణ ప్రక్రియపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 86,773 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. పథకానికి వచ్చిన దరఖాస్తులు మండలవారిగా అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, అట్టి జాబితాననుసరించి నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పథకం వర్తింపచేయాలని వచ్చిన ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా ప్రతి దరఖాస్తును విచారణ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విచారణ టీములు దరఖాస్తు దారుల ఇళ్లకే వస్తున్నందున దరఖాస్తు చేసిన లబ్దిదారులు ఇంటికి సంబంధించిన ఏదేని ఆధారాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. లబ్దిదారులు విచారణకు వచ్చిన టీములకు సహకరించాలని చెప్పారు. తనిఖీలో అర్హుల, అనర్హుల జాబితా రూపొందించాలని, విచారణ నివేదికలు సంబంధిత మండల తహసిల్దార్, యంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు ధృవీకరణతో అందచేయాలని పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్సులో ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin