సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : సమస్త ప్రజానీకం నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం కొనసాగించాలనే దృక్పథంతోనే యజ్ఞ యాగాలు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, షాద్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ద్వారా ప్రజలంతా ఇన్నాళ్లు తాము పడుతున్న కష్టాలకు దూరమవుతారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఆయుత చండీ యాగానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లిన వీర్లపల్లి శంకర్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక భావన అందరిలో ఉన్నప్పుడే ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉంటాయన్నారు. షాద్ నగర్ పట్టణంలో ఇంత భారీ ఎత్తున అతిరుద్ర చండీయాగం నిర్వహించడం షాద్ నగర్ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నారు. పూర్వకాలంలో భూ ప్రపంచంలో శాంతి లోపించినప్పుడు ఋషులు మునులు యజ్ఞ యాగాలు చేసి భగవంతుని కృప వల్ల శాంతి నెలకొల్పేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజంలో పాపాలు పెరిగిపోయాయని, పాపాత్ముల బారి నుండి అమాయక ప్రజానీకానికి కాపాడేందుకు ఇలాంటి యజ్ఞయాగాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన స్వామీజీ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ భగవంతుని దయవల్ల సమస్త ప్రజానీకం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని కోరారు. స్వామీజీ ఆశీస్సులు పొందిన వీర్లపల్లి శంకర్ ఆయుధ రుద్ర చండీయాగానికి హాజరైన సమస్త ప్రజానీకానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేశారు.
-----------------------
Admin