సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే వదిలేసి లక్షలాది రూపాయల ప్రజా ధనం వెచ్చించి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని అధికారులతో లేని అభివృద్ధి గురించి గొప్పలు చెప్పిస్తున్నారని, షాద్ నగర్ యావత్తు సమస్యల వలయం అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పి రఘు తదితరులు ఘాటు విమర్శలు చేశారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నరేందర్ సొంతవార్డు గాంధీనగర్ కాలనీలో సమస్యకు నిలయమైన డ్రైనేజీ కాలువ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల తొమ్మిదవ తేదీన వర్షానికి గాంధీనగర్ కాలనీలో పాత జాతీయ రహదారి పక్కన సమస్య ఏర్పడి ఎంతోమందికి నష్టం జరిగిందని అదేవిధంగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని పేర్కొన్నారు. మీడియా బృందాన్ని పిలిచి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పి రఘు మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ సొంతవార్డులోనే ఈ దుస్థితి ఏర్పడితే మిగతా వార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇన్ని రోజుల నుండి ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన ఈ రహదారి డ్రైనేజీ సమస్యపై మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో షాద్ నగర్ మున్సిపాలిటీలో 33.50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి గొప్పగా నిధులు తగలేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులు గాలికి వదిలేసి పైపై మెరుగులతో మున్సిపాలిటీ గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. నోరు తెరిస్తే అధికారులు కూడా అబద్ధాలు ఆడుతున్నారని ప్రభుత్వానికి వంత పాడుతున్నారని అన్నారు. అడిషనల్ కలెక్టర్ నుండి మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రభుత్వ గురించి గొప్పలు చెబుతున్నారని ఎంతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని చెబుతున్నారని తమ వెంట వస్తే పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో? అధికారులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని సవాల్ విసిరారు. దశాబ్ది ఉత్సవాల పేరిట మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు లాభపడ్డారని ప్రజలు ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. ప్రజాధనాన్ని ఎంతో నిరుపయోగం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే వాటిని మీడియా ముందుకు తీసుకువచ్చి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. దశాబ్ది ఉత్సవాల ముసుగులో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందని ఎన్నికలకు ముందు తప్పుడు దారిలో ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా వాటి గురించి గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. పట్టణములో ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు తమ వద్దకు వస్తే సమస్యలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తామని సూచించారు. గాంధీనగర్ కాలనీలో సమస్య పేరుకుపోయి తిప్పలు పడుతుంటే దశాబ్ది ఉత్సవాల పేరిట అధికారులు ప్రజాప్రతినిధులు ఊరేగడం భావ్యం కాదని, వెంటనే ఈ పనులు చేపట్టకపోతే మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు అలీమ్ షకీబ్, గంగమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin