సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్: అక్రిడేషన్తో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ సీనియారిటీ, పేదరికంగా ఆధారంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( డిజెఎఫ్) జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్, జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణను కోరారు.బుధవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సీనియర్ సంపాదకుల అభిప్రాయల సేకరణ కోసం మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశ సందర్భంగా వాస్తవం ప్రధాన సంపాదకులు, డిజెఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణా రెడ్డి, డిజెఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు పి.విశ్వనాథ్ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియాల్లో పనిచేసే పాత్రికేయులందరికీ సీనియారిటీ, పేదరికం ప్రాతిపదికన డబుల్బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని అల్లం నారాయణకు వివరించారు. అదేవిధంగా చిన్న, పెద్ద మీడియాలంటూ వివక్షత చూపెట్టకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టులకు డబుల్బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా డిజిటల్ మీడియాని గుర్తించి ఆయా మీడియాల్లో పనిచేస్తున్నవారందరికీ ఇండ్ల కేటాయింపుల విషయంలో పరిగణలోకి తీసుకొని జర్నలిజాన్నే నమ్ముకుని బతుకుతున్న వందలాదిమందిని ఆదుకోవాలని డిజెఎఫ్ జాతీయ నేతలు విజ్ఞప్తి చేశారు. అర్హులైన పాత్రికేయులను గుర్తించడానికి సీనియర్ పాత్రికేయులు, వివిధ జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టు ఫెడరేషన్ సభ్యులతో ఓ అత్యున్నత కమిటీని వేసి విధివిధానాలు తయారు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ షయాలన్నింటిపైన మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.డిజిటల్ మీడియాకు గుర్తింపు విషయంలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన అన్నారు. డిజెఎఫ్ అందించిన జర్నలిస్టుల సమస్యల వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు ఈ సందర్భంగా డిజెఎఫ్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న మీడియాల జర్నలిస్టులు, జర్నలిజమే శ్వాసగా బతుకుతున్న అర్హులైన పాత్రికేయుల కష్టాలు బాగా తెలిసిన అల్లం నారాయణ ఈ సమస్యల పరిష్కారంలో తప్పక చొరవచూపెడతారని డిజెఎఫ్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా డబుల్బెడ్రూం ఇండ్లు లేదా ఇండ్ల స్థలాల కేటాయింపుకోసం మంత్రి కెటిఆర్ కొద్ది రోజుల క్రితం స్పందించారు. అందరి అభిప్రాయం మేరకు జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సిఎం కెసిఆర్తో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించాలనే ఉద్దేశ్యంతో మీడియా అకాడమీ ఆధ్వర్వంలో బుధవారం ఓ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన మీడియాల సంపాదకులు, ప్రతినిధులు హాజరయి తమ అభిప్రాయాలను అల్లం నారాయణ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ క్రమంలో వాస్తవం పత్రిక ప్రధాన సంపాదకులు, డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణా రెడ్డి, డిజెఎఫ్ గౌరవాధ్యక్షులు, సీనియర్ పాత్రికేయలు పి.విశ్వనాథ్లు హాజరై చిన్న మీడియాలు, డిజిటల్ మీడియాల పక్షాన తమ డిమాండ్లను వివరించారు. చిన్నమీడియాలు, పత్రికల పక్షాన మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ దృష్టికి తీసుకెళ్ళిన డిజెఎఫ్ నేతలకు ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు,పత్రికల సంపాదకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జాతీయ పిఆర్ఒ సిద్దు బత్రాజ్, డిజెఎఫ్ జాతీయ కార్యదర్శి యూసుఫుద్దిన్ ఖాద్రి, డిజెఎఫ్ డెస్క్ అధ్యక్షుడు బండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin