సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు, స్కూల్ బస్సుల ఫిట్నెస్పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. పాఠశాలల ప్రారంభంతోనే స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నారు. ఫిట్నెస్లేని వాహనాలు రోడ్డుమీదికి వస్తే సీజ్ చేయనున్నారు. షాద్ నగర్ లో ఇప్పటి వరకు ఫిట్నెస్ ప్రక్రియ వేగం పుంజుకున్నది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు 2బస్సులు సీజ్ అయినట్టు షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలు తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గంలో సుమారు 120 సంఖ్యలో బస్సులు ఉండగా 94 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేయించారు. మరో 26 బస్సులకు ఫిట్నెస్ చేయించాల్సి ఉంది. పాఠశాలలు, కళాశాలలకు వినియోగించే బస్సులు వాహన రిజిస్ట్రేషన్ అయిన నుంచి 15 ఏళ్లు మాత్రమే రోడ్డుమీద తిరిగే అవకాశం ఉంటుంది. అలాంటి బస్సులు బయట తిరిగితే సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రవాణాశాఖ ఫిట్నెస్ విషయంలోనూ 15 ఏళ్లు దాటిన బస్సులపై పూర్తిగా కఠినంగా వ్యవహరించడంతో పాటు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35 ప్రకారం ఫిట్నెస్లేని వాహనాల్లో స్కూల్ పిల్లలను తీసుకవెళ్లి ప్రమాదాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్లో విద్యా సంస్థపూర్తి వివరాలు, వాహన యజమాని వివరాలతో వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. బస్సు సీటింగ్ కెపాసిటీని బట్టి రుసుము చెల్లించాలి. ఫిట్నెస్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న తేదీ సమయం కేటాయించిన రోజు సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి బస్సును ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. తరువాత సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఫిట్నెస్ నిబంధనలు ఇవీ.. స్కూల్ బస్సులకు ఫిట్నెస్కు సంబంధించిన పత్రాలు పొందడానికి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఇందుకు కఠినంగానే నిబంధనలు పరిశీలిస్తున్నామని షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలు తెలిపారు. సిటీ టైమ్స్ ప్రతినిధి ఈ అంశాలపై వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను పరిమితికి మించి తీసుకవెళ్లరాదని సూచించారు. అదేవిధంగా బస్సు చక్రాలు కొత్తవిగా ఉండాలి. 10 శాతం కన్నా ఎక్కువగా అరుగుదల ఉండవద్దు, బస్సుకు అద్దాలు ఉండాలి.. ఎమర్జెన్సీ డోర్ తప్పనిసరిగా ఉండాలి, సరిపడా మందులతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. బస్సు క్లచ్, బ్రేక్ ఎప్పుడూ సరిచూసుకోవాలి. చిన్నపిల్లల బస్సులో 325 సెంటిమీటర్ల పైనా మెట్లు ఉండాలి. బస్సుకు సైడీ రెయిలింగ్ అవసరం... బస్సులో నిలువు రాడ్లు ఉండాలి. కార్మిక్స్ మిర్రర్ ఉండాలి. ఈ అద్దం గుండా బస్సులోని పిల్లలను ఎప్పటికప్పుడు డ్రైవర్ పరీక్షించాలి, బస్సుకు అప్పర్లైట్లు ఉండాలి, బస్సును నిలిపినపుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. ప్రతీ బస్సులో సహాయకుడు (అటెండర్) ఉండాలి. బస్సులో ప్రయాణించే అయా పిల్లల వివరాలు, చిరునామా, మొబైల్ నంబర్ బస్సు చార్ట్లో పొందు పరచాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్తో కలిసి నెలకొకసారి వాహనాన్ని పరిశీలించాలి. బస్సు డ్రైవర్ పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు అన్లైన్లో నమోదు చేయాలి. డ్రైవర్కు ప్రతీ మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్, కంటి చూపు పరీక్షలను ఆయా విద్యా సంస్థలు చేయించాలి. 60 ఏళ్లు పైబడినవారిని డ్రైవర్గా నియమించవద్దు, వాహన డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కంటి చూపు, వినికిడి సమస్య ఉన్నవారితో డ్రైవింగ్ చేయించవద్దు. మద్యం వ్యసనం ఉంటే తొలగించాలి. ఫిట్ నెస్ లేకుంటే బస్సులు సీజ్ చేస్తామని షాద్ నగర్ రవాణా శాఖ అధికారి బాలు తెలిపారు.
-----------------------
Admin