సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ దారుణ హత్య కు గురైన సంఘటన చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుమలత (35)కు ఇద్దరు పిల్లలు కుమారుడు జశ్వంత్, కుమార్తె తేజస్విని ఉన్నారు. ఆమె భర్త మహేందర్ అనారోగ్యంతో నాలుగు సంవత్సరాల కిందట చనిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా..... సుమలత బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వరంగల్ కి షాపింగ్ కోసం వెళ్ళినట్లు స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఇంటికి చేరుకోలేదు. గురువారం ఉదయం ఉపాధి హామీ పనుల నిమిత్తం వెళ్తున్న ఏలుకుర్తి గ్రామస్తులకు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హత్యా సమాచారం అందుకున్న వెంటనే దుగ్గొండి ఎస్సై రణధీర్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లక్ష్మీపురం శివారు కెనాల్ కాల్వలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతురాలిని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి సుమలత గా పోలీసులు గుర్తించారు క్లూస్ టీమ్ సహాయంతో అక్కడి ఆధారాలను సేకరిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు దగ్గరలో ఒక కత్తి సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకలు కాల్వ దగ్గరలో ఉన్నాయి. తోపులాట జరిగినట్లు కాల్వ దగ్గర ఆమె మెడలో ఉండే ముత్యాల దండ పడి ఉంది. చెప్పులు, బ్యాగు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆమెను హత్యకు గురైనట్లు ఉందని పోలీసులు తెలిపారు. సుమలత ను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. సుమలత దారుణ హత్యకు గురికావడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు, విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-----------------------
Reporter