సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పుట్టపర్తి పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 3, 4వ తేదీలలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పుట్టపర్తిలో పర్యటిస్తుండగా, సోమవారం రాష్ట్ర గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సమాధిని జిల్లా కలెక్టర్, ఎస్పీలు దర్శించుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయం, శాంతి భవన్ వద్ద, ఈనెల 4వ తేదీన రాష్ట్ర గవర్నర్ పాల్గొనే సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర గవర్నర్ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలని, గవర్నర్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నవీన్ కుమార్, సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin