సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ వైద్య రంగంలో నూతన విప్లవం.. దేశ చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం.. ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్న శుభసమయం.. ఎనిమిదేండ్లలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలంగాణ, మరో చారిత్రక ఘట్టానికి కూడా వేదిక కాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి వర్చువల్గా ఒకేసారి తరగతులను ప్రారంభించనున్నారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ కలను సాకారం చేసే దిశగా అతిపెద్ద అడుగు పడబోతున్నది. ఈ 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే. ఇందులో గాంధీ (1954), ఉస్మానియా (1946) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించేనాటికే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో మరో వైద్య కళాశాలను మాత్రమే ఏర్పాటుచేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు మంచి వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మారాయి. ఏదైనా పెద్ద వ్యాధి వచ్చినా, మెరుగైన వైద్యం పొందాలన్నా హైదరాబాద్కు పరిగెత్తాల్సిన దుస్థితి. వందల కిలోమీటర్ల దూరం.. గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చేది. అంత ప్రయాసపడి వచ్చినా.. చికిత్స కోసం వారాలు, నెలలపాటు అకడే ఉండాల్సిన పరిస్థితి. సరైన వసతులు లేక సహాయకులు అష్టకష్టాలుపడేవారు. దీంతో కుటుంబాలు ఆగమయ్యేవి. మరోవైపు.. ఐదు కాలేజీల్లో కలిపి 850 సీట్లు మాత్రమే ఉండేవి. దీంతో మెడిసిన్ చదువాలనుకున్న ఎంతోమంది విద్యార్థులు తమ కలలకు దూరమయ్యేవారు. మరికొందరు విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలయ్యారు. @జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యం@ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలు వైద్యం కోసం పడుతున్న కష్టాలను కండ్లారా చూశా రు. స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయాలని నిర్ణయించుకొన్నారు. ఇందుకోసం జిల్లా కు ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మొదటి దశలో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుటా ్టరు. మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేశారు. రెండో దశలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం), నాగర్కర్నూలు, రామగుండం (మంచిర్యాల)లో కాలేజీలను ఏర్పాటుచేశారు. ఎనిమిదేండ్లలోనే కాలేజీల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది. ఉమ్మడి పాలనలో 57 ఏండ్లలో ప్రభుత్వాలన్నీ కలిపి తెలంగాణలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలే. అంటే.. సగటున 19 ఏండ్లకు ఒక కాలేజీని ఏర్పాటు చేస్తే.. సీఎం కేసీఆర్ పాలనలో ఎనిమిదేండ్లలోనే 12 కాలేజీలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది 9, ఆ పై ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కానున్నది.
-----------------------
Admin