సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజా సమస్యలు పక్కదారి పట్టించే అందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సునీత అంశాల ఆధారంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలని ఉపాధి అవకాశాలు కల్పించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక సిపిఎం కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై విపరీతమైన భారాలు మోసపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి ఇప్పటివరకు నిత్యవసరాల ధరలు 200 శాతం పెరిగాయని ఈ నెలలోనే కూరగాయల ధరలు 37% పెరిగాయని మోడీ ప్రభుత్వం విధానాలు పెట్టుబడిదారులకు రాయితీలు సామాన్యులకు భారాలు అనే పద్ధతిలో ఉన్నాయని ఆయన విమర్శించారు. ప్రజల బాధలు తీర్చే ఆలోచనలు చేయకుండా మోడీ ప్రభుత్వం దేశంలో మతవిద్దేశాలు రెచ్చగొట్టి ప్రజాసమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని విదేశాలకు వెళ్లడానికి తీరిక దొరికిన ప్రధానికి స్వదేశంలో ఒక రాష్ట్రం రావణకాష్టంగా మారితే మణిపూర్కి వెళ్లే తీరిక లేదని ఆయన ఎద్దేవా చేశారు. మణిపూర్ లో గత నాలుగు నెలల నుండి హింసాత్మక ఘటనలు జరుగుతున్న స్పందించని మోడీ ప్రభుత్వం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా స్పందించారని విమర్శించారు. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలని ఆలోచన తప్ప ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి దళిత బంధు పథకాలు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఉపాధి వనరులుగా మారాయని ఎమ్మెల్యేల జోక్యంతో వారి కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాలు వర్తింప చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దళిత బంధు అమలులో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికి అమలు చేయకపోతే లబ్ధిదారుల తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో 1970కి ముందు ఉన్న వారికే గృహలక్ష్మి పథకం వర్తింపజేయడం అంటే ఇతర కులాల వారికి పథకం వర్తింప చేయకుండా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కులం 1970 నిబంధనతో సంబంధం లేకుండా స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ ఒకటి నాటికే రైతుల లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు తప్ప అమలు చేయలేదని ఆరోపించారు. 14 లక్షల ఎకరాలు పోడుభూమి ఉందని ప్రభుత్వమే సర్వే చేసి చెప్పింది కానీ నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు పంపిణీ చేశారని మిగతా వాటికి అనేక నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టె వరాలు కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధానాలు తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఆయన తెలియజేశారు. కరీంనగర్ సంగారెడ్డి జిల్లాలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై ఏబీవీపీ గుండాల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భౌతిక దాడులతో ఎదుటివారి ఉద్యమాలను అణిచివేయాలని చూడడం అవివేకం తప్ప మరొకటి కాదు అని చేతనైతే పోరాటాలు ఉద్యమాలలో పోటీపడాలి కానీ ఉద్యమాలు పోరాటాలు చేతకాక భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, వేపాకుల శ్రీను, ఎలమంచిలి వంశీ, చిరంజీవి నాయుడు, భూక్య రమేష్, మర్మం చంద్రయ్య, దొడ్డ లక్ష్మీనారాయణ, ముదిగొండ రాంబాబు, యు నాగేశ్వరరావు, మోరంపూడి శ్రీనివాస్, సమ్మయ్య, డి వీరన్న, జునుమాల నగేష్, వినోద, బాలకృష్ణ, కిషోర్, సంధ్య, కోబాల్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin