సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు ఘనంగా జరిగిన "డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్" వేడుకలు, ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్, క్రీడా పోటీలలో గెలుపొందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బహుమతులను అందించిన ఎస్పీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. గత మూడు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వహించిన అన్ని క్రీడా పోటీలు కూడా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పాల్గొన్నారు. గౌరవ అతిథిగా ఆయన సతీమణి ప్రీతి పాల్గొన్నారు. ముందుగా ముఖ్యఅతిథిని 09 ప్లాటూన్లతో స్పోర్ట్స్ పెరేడ్ ద్వారా ఆహ్వానం పలికారు. అనంతరం 100 మీటర్ల పరుగు పందెం ఫైనల్ మరియు టగ్ ఆఫ్ వార్ ఫైనల్ పోటీలను నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ప్రజలకు సేవలందిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా ఉండాలని, ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఎదో ఒక వ్యాయామం గానీ, క్రీడను గానీ అలవాటుగా చేసుకోవాలని సూచించారు. క్రీడలలో గెలుపోటములు సాధారణమని, క్రీడా స్పూర్తితో ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించినప్పుడే జీవితంలో కూడా ఒడిదుడుకులను ఎదుర్కోగలమని అన్నారు. అనంతరం ఈ క్రీడలలో గెలిచిన క్రీడాకారులకు బహుమతులను, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కు ప్రతీకగా సూచించే పోలీస్ పతాకాన్ని ఎస్పీ గారికి క్రీడాకారులు అందించారు. అనంతరం పటాసులు కాల్చి క్రీడా సంబురాలను ఘనంగా ముగించారు. క్రీడా పోటీల్లో అన్ని సబ్ డివిజన్ల నుండి పోలీస్ అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
-----------------------
Admin