సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావుపేట ఎన్నికల హామీలను విస్మరిస్తున్న పాలక పార్టీలకు ప్రజా ఉద్యమాలతోనే గుణపాఠం చెప్పాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఎంసిపిఐ(యు) చెన్నారావుపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ గోర్మియా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న ప్రజాసంఘాల నాయకులు జన్ను రమేష్ అబ్బదాసి అశోక్ ముర్రి శ్రీనులకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ఎన్నో ఆశలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లేకపోగా అప్పుల కుప్పగా మారిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అందని ద్రాక్షగా మారాయని గత ప్రభుత్వాల వైఫల్యాలని ఎత్తిచూపుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రైతాంగం ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన సరైన విధంగా ఎరువులు అందించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు సైతం సహకరించక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ప్రజల అవస్థలు పడుతున్నారని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని గొప్పగా చెప్పి ఆచరణలో కొద్దిమందికే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో సమస్యల పరిష్కారానికి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ మండల నాయకులు శ్రీను మెతుకుపల్లి రాజిరెడ్డి అచ్చ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter