సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అధికారులతో కంటి వెలుగు, సముదాయంలో కార్యాలయాల నిర్వహణ పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రత్యేక అధికారులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నమోదు నుండి పరీక్ష పూర్తయ్యే వరకు క్యూ, వేచివుండు ఏర్పాట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మెప్మా, స్వయం సహాయక బృందాలు ప్రజల సమీకరణ విషయంలో ఉదయం, మధ్యాహ్నం పూటలుగా కార్యాచరణ చేయాలన్నారు. జిల్లాలో గురువారం 55 శిబిరాలు నిర్వహించి 5, 615 మందికి పరీక్షలు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో శిబిరంలో రోజుకు కనీసం 150 మందికి పరీక్షలు చేసేలా జన సమీకరణ చేయాలన్నారు. కంటి వెలుగుపై ఆడియో సందేశంతో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శిబిరాల్లో రోజువారి కళ్ళాద్దాల పంపిణీని తెలియపర్చి, వారికి కావాల్సిన ఇండెంట్ ను ముందస్తుగా సమర్పించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేసినట్లు, విజయవంతానికి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని శాఖలు ఒకే గొడుగు క్రింద పనిచేస్తున్నట్లు, ఒకరికొకరు సహకరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఇంకనూ తరలింపు చేపట్టని కార్యాలయాలు వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని, నేటి నుండి కార్యాలయాలు క్రొత్త ప్రాంగణంలో నిర్వహించాలని ఆయన తెలిపారు. సమయపాలన పాటించాలని, వంద శాతం సిబ్బంది హాజరును జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన అన్నారు. కాలపరిమితి దాటిన ఫైళ్లు, ఫర్నిచర్ ఖండం చేయాలని ఆయన తెలిపారు. పార్కింగ్ కు కేటాయించిన స్థలంలోనే వాహనాల పార్కింగ్ చేయాలని ఆయన అన్నారు. సముదాయంలో ఏర్పాటు చేసిన క్రేచే ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సముదాయంలో అన్ని రకాల వసతులు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో ఎన్. శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin