సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : చట్టపరమైన హక్కులు అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఉద్యమాలను, పోరాటాలను సింగరేణి యాజమాన్యం జీర్ణించుకోలేకపోతోందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే హక్కు సింగరేణి అధికారులకు ఎవరిచ్చారని సిపిఐ భద్రాది జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ప్రశ్నించారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం మైనింగ్, టెక్నికల్ సబ్ కమిటీల ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షల శిభిరం టెంటును తొలగించి దౌర్జన్యానికి పాల్పడిన సింగరేణి సెక్యూరిటీ గార్డులు, వారికి ఆదేశాలు జారీచేసిన అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంటును తొలగించిన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుబంద సంఘాల అనుమతులిస్తూ ఏఐటియుసి పట్ల వివక్షణత ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఉద్యమాలు, ఆందోళనలు, దీక్షలు చేసుకునే హక్కు ఎవరికి లేదని, యాజమాన్యం తీరు మార్చుకోని పక్షంలో తగిన రీతిలో గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, నూనావత్ గోవిందు, మాచర్ల శ్రీనివాస్, కిష్టోఫర్, జె. గట్టయ్య, కె.రాములు, కొచ్చెర్ల జోసఫ్, కె.సోమయ్య, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin